పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాప్రయత్నం చేసిన సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకున్నది. వేంపల్లె ఎస్సై సుభాష్ చంద్రబోస్ వేధిస్తున్నాడంటూ రవికుమార్ అనే వ్యక్తి నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ దగ్గర సూపర్ వాస్మోల్ త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.
రవికుమార్ పై స్థానిక రాజీవ్ నగర్ కాలనీలోని ఒక ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఆ కేసుకు సంబంధించి అతనికి సమన్లు వచ్చాయి. ఆ సమన్లు ను రవికుమార్ కు కానిస్టేబుల్ ఇచ్చి కోర్టు కు హాజరు కావాలని చెప్పాడు.
పోలీస్ స్టేషన్ కు వచ్చిన రవికుమార్ ఎస్ఐ వేధిస్తున్నాడని మనస్తాపంతో పోలీస్ స్టేషన్ దగ్గర వాస్మోల్ త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడి పోలీసు సిబ్బంది, స్థానికులు వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు.
ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ ఈ సంఘటనకు కారణమని బాధితుడు రవికుమార్, బాధితుడి తల్లి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సీఐ వెంకటేశ్వర్లు ను వివరణ కోరగా తాము రవికుమార్ కు ఎటువంటి వేధింపులకు గురి చేయలేదని చెప్పారు.