న్యాయం, సమానత్వం పరిఢవిల్లాలంటే అది మన ఇంటి నుంచి ప్రారంభం కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ, జ్ఞానం అందరికీ సంబంధించిందని కానీ కొన్ని కారణాలవల్ల ప్రజలకి విజ్ఞానం అందకపోవటంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి చైతన్య సదస్సులు నిర్వహించి విజ్ఞానాన్ని పంచుతున్నట్లు ఆయన వివరించారు. ప్రజల కోసం అవగాహన నిమిత్తం బాల కార్మిక వ్యవస్థ, భ్రూణ హత్యలు, అవినీతి, రోడ్డు నియమాలు తదితరాలపై పోస్టర్లను ఆవిష్కరించి వివిధ ప్రదేశాలలో వుంచినట్లు న్యాయమూర్తి తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ జిల్లా న్యాయమూర్తి చొరవతో ప్రజలలో అవగాహన పెంచే నిమిత్తం వివిధ పోస్టర్లను తయారు చేయడం అభినందనీయమన్నారు. పోలీసు కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, ప్రజలందరూ తమ ఆరోగ్య పరిరక్షణ కోసం నడక సాధన చేస్తున్నట్లుగానే సమాజ ఆరోగ్య పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలకు హాజరు కావాలని కోరారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాష, ఎన్. సంతోష్ కుమార్, శాంతి సోనీ, మౌనిక, వెంకట హైమ పూజిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.