అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సికింద్రాబాద్ విభాగ్ సహకార్యవాహ భరతపూడి శ్రీనివాస్జీ అన్నారు. శామీర్పేట మండలం లాల్గడి మలక్పేట పరిధిలోని ఎన్పిఆర్ గార్డెన్ ఫంక్షన్ హాలులో శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత ట్రస్టు ” ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మించనున్నరామ మందిర నిర్మాణం కోసం జనజాగరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శామీర్పేట ఖండ సంఘ చాలకులు కన్రెడ్డి ప్రభాకర్రెడ్డి, సికింద్రాబాద్ విభాగ్ సహకార్యవాహ భరతపూడి శ్రీనివాస్లు విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరతపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ… రామజన్మ భూమి అయోధ్యలో మందిర నిర్మాణం కోసం జరిగిన కరసేవ లాంటి ఉద్యమ ఘట్టాలను వివరించారు. 1980లో రామ జన్మభూమి కోసం ప్రారంభమైన ఉద్యమం సుధీర్ధంగా సుమారు 50 సంవత్సరాల పాటు కొనసాగిందని, ఆ పోరాట ఫలితమే నేడు అయోధ్య రామ మందిర నిర్మాణమని వివరించారు. ఒక గుడి కోసం జరిగిన ఇలాంటి పోరాట ఉద్యమం ప్రపంచ చరిత్రలో లేదని ఇక మీదట కూడా ఉండబోదని, ఇది హిందువుల పట్టుదల పరాక్రమాలకు నిలువెత్తు నిదర్శనమని నొక్కివక్కానించారు. రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా దాదాపు 4లక్షల మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా ఆర్పించారని వారి త్యాగాలను కొనియాడారు. మందిర నిర్మాణం కోసం 6 లక్షల గ్రామాల నుంచి ఇటుకలను పంపించిన విధానాన్నివివరించారు. దేశాన్ని రక్షించుకోవాలంటే హిందూవులంతా సంఘటితమై ఉండాలన్న మహానుభావుల మాటను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. అయోధ్యలో నిర్మించబోయే భవ్యసుందరమైన పవిత్ర రామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా చేయి చేయి కలపాలని పిలుపు నిచ్చారు.
జనవరి 20వ తేది నుంచి ఫిబ్రవరి 10వ తేది వరకు జరగబోయే జనజాగరణకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో శామీర్పేట, మూడుచింతలపల్లి మండలాలకు చెందిన 28 గ్రామాల నుంచి 100 మంది వరకు హిందువులు వివిధ సంఘాలు, సంస్థల సభ్యులు, శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత ట్రస్టు కార్యకర్తలు పాల్గొన్నారు.