పేద ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.TNGOs భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు మంత్రి అల్లోల బతుకమ్మ చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ. 317 కోట్లు ఖర్చు పెట్టి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు.
రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరల పంపిణీ చేస్తున్నట్లు, ఇందుకోసం 287 కు పైగా డిజైన్ల చీరలు అందుబాటులో ఉంచామని తెలిపారు.
మహిళలందరికి పెద్దన్నగా మారి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరలను ఇస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్ళు నిండి, తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి చీరలు అందిస్తున్నామని చెప్పారు.