కరోనా కష్ట కాలంలో రోటరీ క్లబ్ ప్రజలకు అండగా నిలిచిందని, వారి సేవలు ప్రశంసనీయమని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వినుకొండ రోడ్డులోని రోటరి క్లబ్ కార్యాలయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మొత్తం 13 ఆక్సీజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన కల్మర్ రోటరీ క్లబ్ నరసరావుపేట వారికి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. ప్రభుత్వంతో పాటు అనేక మంది వైద్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా కరోనా వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగామని శాసనసభ్యుడు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో, కొవిడ్ రెండు దశల్లో రూ.3.800 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19 కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్ 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయన్నారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచిందని అన్నారు. మూడో దశ సంకేతాలు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే దక్షిణాదిలో రెండు కొత్త కేసులు నమోదైనందున కొత్త వేరియంట్ ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జాస్తి రంగారావు, దాసరి హనుమకుమార్, రొటేరియన్లు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేశ్, ఎన్ కే ఆంజనేయులు, వీఎస్పీ సాంబ, ప్రాధమిక వైద్యశాల వైద్యులు పాల్గొన్నారు.