భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇటీవల కొద్ది రోజులుగా 40 వేలకు పైనే రోజూవారీ కేసులు వెలుగు చూస్తుండగా.. ఆదివారం ఆ సంఖ్యలో తగ్గుదల కనిపించింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఢిల్లీలో వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 38,772 కొత్త కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 94 లక్షల మార్కును దాటేసింది. దాంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 94,31,691 కేసులు నమోదయ్యాయి. అయితే, పరీక్షల సంఖ్య తగ్గడం కూడా కేసుల సంఖ్యలో తగ్గుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం.. నిన్న 8,76,173 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఇక, కొత్త పాజిటివ్ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. నిన్న ఒక్కరోజే 45,333 మంది కోలుకోగా..మొత్తం రికవరీల సంఖ్య 88,47,600గా ఉంది. రికవరీ రేటు 93.81 శాతానికి పెరగ్గా..క్రియాశీల రేటు 4.74 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 4,46,952 క్రియాశీల కేసులున్నాయి. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 443 మంది మరణించారు. దాంతో ఈ మహమ్మారి కారణంగా 1,37,139 మంది ప్రాణాలు వదిలారు.
కోలుకుంటున్నఢిల్లీ!
కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశరాజధాని నగరం కోలుకుంటున్నఛాయలు కనిపిస్తున్నాయి. వరసగా రెండో రోజు ఐదు వేలకు దిగువన కొత్త కేసులు నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. నిన్న 4,906 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య(68) తక్కువగా ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. నవంబర్ 7 తర్వాత అక్కడ ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి.