ప్రతి పేదవారికి మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం ఆరోగ్యం, వైద్య విద్య వ్యవస్థను బలోపేతం చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ పేర్కొన్నారు. గ్రామం, మండల కేంద్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.
మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించి రూ.80లక్షలతో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. చింతకాని మండలం గాంధీ నగర్లో రూ.20లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం పాతర్లపాడు గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. నేరడ గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను వారు ప్రారంభించారు. కోదుమూరు గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతీ, పి.అర్.ఈ.ఈ. కె.వి.కె.శ్రీనివాస్, డివిజన్ పంచాయతీ అధికారి పుల్లారావు, ఎం పి.పి. పూర్ణయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.