ప్రభుత్వం తీసుకుంటున్న చట్టవిరుద్ధ నిర్ణయాలకు హైకోర్టు ఇస్తున్న తీర్పులు చెంపపెట్టులాంటివని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఉపాధి హామీ పథకం పనులు చేసిన వారికి హైకోర్టు తీర్పు తర్వాత అయినా ప్రభుత్వం తక్షణమే బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ నాయకుల ఒత్తిడికి లొంగి అధికారులు పనిచేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు నిబంధనలు మేరకు పనిచేయాలని ఆయన కోరారు. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో పెండింగ్ బిల్లుల చెల్లించాలని, పనులు చేసిన వారికి బిల్లులు వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు.
పనులు చేసిన వారికి ఎలాంటి కోతలు లేకుండా, ఆలస్యమైన కాలానికి నరేగా నిబంధనల ప్రకారం 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమని డాక్టర్ చదలవాడ అన్నారు.