తెలుగు వారికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మరో సారి తీరని అన్యాయం చేసింది.
తెలుగు చలన చిత్ర సీమలో తిరుగులేని ముద్ర వేసిన సూపర్ స్టార్ కృష్ణ కు కాకుండా కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడుకు చెందిన రజనీకాంత్ కు ఈ సారి దాదా సాహెబ్ అవార్డ్ ఇచ్చింది. రాజకీయ కారణాలతో సీనీరంగాన్ని కూడా వాడుకుంటున్న బిజెపి చేసిన ఈ చర్యకు సినీ రంగానికి చెందిన పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణకు ఈ సారి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వస్తుందని అందరూ భావించారు. సూపర్ స్టార్ కృష్ణ సాధారణంగా అవార్డులకు దూరంగా ఉంటారు. అయితే ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకు దాదా అవార్డు కచ్చితంగా వస్తుందని అందరూ అనుకున్నారు.
అయితే కేంద్రంలోని బిజెపి దారుణంగా వ్యవహరించి తమకు టాలెంటుతో పనిలేదు కేవలం రాజకీయాలే ముఖ్యం అనే రీతిలో ప్రవర్తించడం పలువురిని ఆశ్చర్య పరిచింది. సినీ రంగానికి వన్నె తెచ్చిన సూపర్ స్టార్ కృష్ణకు జరిగిన అన్యాయాన్ని ముక్త కంఠంతో అందరూ ఖండిస్తున్నారు.
తెలుగు తెరకే కాకుండా భారతీయ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ సుపరిచితుడు. హీరోగా, నిర్మాతగానే కాకుండా స్టూడియో అధినేతగా ఆయన సినీ రంగానికి చేసిన సేవలు అద్వితీయం.
తెలుగు తెరకు సినిమా స్కోప్ ను పరిచయం చేయడం నుంచి మల్టీ స్టారర్ చిత్రాలను నిర్మించడంలో సూపర్ స్టార్ కృష్ణ తనదైన ముద్రను వేశారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు రంగులు అద్ది ప్రేక్షకులకు కలర్ చిత్రాలను చేరువ చేయడంలో ఆయన చూపిన సాహసం వేరెవరూ చేయలేదు.
అల్లూరి సీతారామరాజుగా ఆయన చూపిన నటన ఈ నాటికి అభిమానులకు గుర్తుంది. అలాంటి సూపర్ స్టార్ ను కాదని తమిళనాడులో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం కరెక్టు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రజనీకాంత్ కు వచ్చే ఏడాది అయినా ఇవ్వవచ్చు. వయో భారంతో ఉన్న సూపర్ స్టార్ కృష్ణకు ఈ ఏడాది ఇవ్వడం కరెక్టు. అయితే రాజకీయాల ముందు ఇవేవీ పనికి రావని బిజెపి నాయకులు మరొక్క సారి నిరూపించుకున్నారు.
సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, www.satyamnews.net