ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమిటి? భలే ప్రశ్న అడిగారండి, ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? కరెక్టుగా ఇదే జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతున్నది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నది.
వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి బాగా తగ్గి వైసిపికి అన్ని సీట్లూ రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తున్నది.
ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం మరో వైపు బిజెపికి కుంగదీస్తున్నది. వైసిపిని అందుకోసం కూడా బిజెపి కట్టడి చేయలేకపోతున్నది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తున్నది.
జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం వస్తున్నది. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి తో విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తున్నది.
అయితే పవన్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఫోల్డ్ లోకి వచ్చే విధంగా బిజెపి చేసుకున్నది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నది.
అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారు.
జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోయింది. పైగా ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో మళ్లీ బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలను తానే పాతర వేసుకుంటున్నది.
సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్.నెట్