దక్షిణ తెలంగాణను ఎడారి చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పథకాలను తక్షణమే నిలుపుదల చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఒక్క వంతుల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్టీ రామారావు,రాజశేఖర్ రెడ్డి పాలనలో ఇష్టారాజ్యంగా జల దోపిడీ జరిగిందని, కృష్ణా బేసిన్ నీటిని దౌర్జన్యంగా అక్రమంగా తరలించారని ఆయన అన్నారు.
హుజూర్ నగర్ సిపిఐ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగిన దీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శ్రీశైలం ప్రాజెక్టు సాగర్ ఆయకట్టు భూములకు నీరు ఇవ్వడానికి, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటానికి మాత్రమే నిర్మించారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవో కు వ్యతిరేకంగా మరింత ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఐ ఎన్ టి యు సి ఆర్గనైజింగ్ కార్యదర్శి యరగాని నాగన్న మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పిదాలను విమర్శించిన ప్రస్తుత పాలకులు కూడా అదే తప్పిదం చేస్తున్నారని అన్నారు.
తెలంగాణకు ఉద్యమాలు కొత్తకాదు
తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్త కావని చూస్తూ ఊరుకోబోమని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాడతామని, న్యాయంగా మనకు రావలసిన కృష్ణాజలాలను కాపాడుకుంటామని అన్నారు. ఐఎఫ్టియు జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర పాలకులు దోపిడీకి రుచి మరిగి ఏమాత్రం అవకాశమున్నా నీటిని తరలిస్తున్నారని అన్నారు.
కృష్ణ ,గోదావరి నీళ్ళను అత్యధికంగా వాడుకుంటూనే అత్యల్ప వర్షపాతం ఉన్న రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకు పోతే నష్టం ఏమిటి అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పులి చింతల వెంకటరెడ్డి, రైతు సంఘం జిల్లా యాక్టింగ్ ప్రెసిడెంట్ కొప్పోజు సూర్యనారాయణ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఇంకా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, బిజెపి జిల్లా నాయకులు ముసుగుల చంద్రారెడ్డి సిపిఎం నాయకులు బ్రహ్మం న్యూ డెమోక్రసీ నాయకులు కాకి అజయ్,మున్సిపల్ కౌన్సిలర్లు శ్రవణ్ కుమార్,రామగోపి తదితరులు కూడా పాల్గొన్నారు.