జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం డీజీపీ మహేందర్రెడ్డి, ఎన్నికల కమిషనర్ పార్థసారథికే అంకితం చేస్తున్నామని బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కార్యకర్తల కంటే ఎక్కువగా డీజీపీ, ఎస్ఈసీలే తమ విజయానికి నాందీ పలికారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 4 సీట్లున్న బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో అర్థ శతకానికి దగ్గరగా రావడం అభినందనీయమని, సంతోషకరమని అన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ (2023?) ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని బండి జోస్యం చెప్పారు. అహకారంతో ఉన్న వారికి ప్రజలే సరైన రీతిలో సమాధానం చెప్పారని బండి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీ విజయంతో మరోసారి భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లభించడం సంతోషమని అన్నారు.
గడీల పాలనను బద్ధలు కొడతాం: బండి
సారు, కారు, ఇక రారని ఏద్దేవా చేశారు. 2023లో కారు షెడ్డుకు పోవటం ఖాయమన్నారు. అర్థరాత్రి ఎలక్షన్ కమిషనర్ తప్పుడు సర్క్యులర్ ను విడుదల చేయటం దారుణమన్నారు. మంత్రులకు,ఎమ్మెల్యేలకు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని తద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని సూచించారు. గడీల పాలనను బద్దలు కొట్టే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. గడీ నుంచి సీఎం కేసీఆర్ ను బయటకు తీసుకొస్తామన్నారు. గ్రేటర్ లో గెలిచిన తాము అహంకారాన్ని ప్రదర్శించబోమన్నారు. ఎళ్ళవేళలా ప్రజాశ్రేయస్సే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తమకు ప్రశ్నించే భాగ్యాన్ని కల్పించినందుకు సంతోషకరమన్నారు. ఇక భాగ్యనగర ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భాగ్యనగర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామన్నారు. సీట్లు మాత్రమే కాదు.. బీజేపీ ఓట్ల శాతం కూడా ఈ ఎన్నికల్లో భారీగా పెరిగాయన్నారు. జాతీయ నాయకుల ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఆదరణ కోల్పోతున్న గులాబీ: కిషన్రెడ్డి
తెలంగాణ ప్రజల సవాల్ను టీఆర్ఎస్ స్వీకరించాలని, గులాబీ పార్టీ ప్రజల్లో వేగంగా ఆదరణ కోల్పోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అధికార పక్షానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. 2023లో అధికారానికి రావడానికి గ్రేటర్ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయన్నారు. అధికార పక్షం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ ప్రజలంతా చూస్తున్నారని వారే నిజమైన న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారన్న విషయాన్ని టీఆర్ఎస్ మరిచిపోయిందని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు చేసినా, వారిపై అక్రమ కేసులు బనాయించినా ఒక్క అడుగు సైతం వెనుకడుగు వేయలేదన్నారు. ఇప్పటికీ కూడా బీజేపీ తరఫున గెలిచిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా రీకౌంటింగ్ అంటూ గులాబీ బాస్ ఆదేశాలతో ఆయా అధికార పక్షం వహిస్తున్న అధికారులు మొండికేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఒక మునిగిపోయే నావ అని అందులోకి తమ పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఎవ్వరూ వెళ్ళరని అన్నారు. ఇక చివరగా హంగ్పై స్పందిస్తూ పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక దీనిపై స్పందిస్తామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
చావు తప్పి కన్ను లొట్టపోయింది! డీకే అరుణ
వంద సీట్లు తమవేనన్న టీఆర్ఎస్ చావు తప్పి కన్నులొట్టపోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్కు కాలం చెల్లినట్లేనన్నారు. గులాబీకి బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అవకాశ వాద రాజకీయాలకు టీఆర్ఎస్ పార్టీ తెరతీసిందని డీకే అరుణ విమర్శించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు.