సిఎం కేసీఅర్ కుటుంబ పాలనను అంతమొందించాలి: రాజ్య సభ్యుడు డా.కే.లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, కేసీఅర్ కుటుంబ పాలనను అంతమొందించాలని రాజ్య సభ్యుడు డా.కే.లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాలులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి డాక్టర్.కే. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్, ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర రెడ్డి, గరిక పాటి మోహన్ రావు, మాజీ మంత్రి విజయ రామారావు, బీజేపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్, సీనియర్ నాయకులు మాట్లాడుతూ డాక్టర్.కే.లక్ష్మణ్ బీజేపీలో సామాన్య కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగి పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారని, కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరినీ బీజేపీ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందన్నారు.
ఇందులో భాగంగానే లక్ష్మణ్ ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని బీజేపీ నాయకులు తెలిపారు. నరేంద్ర మోడీ 2014 నుండి సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే నినాదంతో కుల,మతాలకు అతీతంగా దేశాన్ని పాలిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అందుకే ప్రజలు రెండో సారి నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కుటుంబ పాలనను అంతమొందించి బీజేపికి అవకాశం ఇవ్వాలని, బీజేపీ తోనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, మహిళలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.