నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు సమర్పించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో వందలాది మంది పేద ప్రజలు నిత్యం ప్రభుత్వాస్పత్రికి వివిధ రోగాలతో వస్తున్నారని ఆయన తెలిపారు.
స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల పేదలకు వైద్యం అందకుండా పోతుందని అలాగే నిత్యం గర్భిణీ స్త్రీలు వైద్యానికి వస్తే స్కానింగ్ లేక ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తున్నదని ఆయన తెలిపారు. అందుకే స్కానింగ్ సెంటర్ ను ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
పేషెంట్లకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి నిరంతరం పేద ప్రజలకు అన్ని రకాల చికిత్సలకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో మీసాల అంజయ్య, రాగి నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.