కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిధి అయిపోయినందున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రక్త దాన శిబిరాలకు అనుమతి ఇస్తున్నది. తలసేమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలకు రక్తం ఎల్లవేళలా అవసరం అవుతూ ఉంటుంది.
లాక్ డౌన్ నిబంధనలతో రక్త దాతలంతా ఇళ్లకే పరిమితం కావడంతో తలసేమియా రోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ వెసులు బాటును ఉపయోగించుకుని రక్తం అవసరమైన వారి కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.
దాదాపుగా వెయ్యి మందికి తక్కువ కాకుండా రక్తదాతలను ప్రోత్సహించి విడతల వారీగా రక్తదాన శిబిరాలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ నిర్వహిస్తున్నారు. ఈ రక్త దాన మహా కార్యక్రమంలో భాగంగా నేడు ఆయన షేక్ పేట్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలకు లోబడి సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాతలు తమ రక్తాన్ని దానం చేశారు.
ఎమ్మెల్యే మాగంటిని అభినందించి ఉప ముఖ్యమంత్రి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన మొహమ్మద్ అలీ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేస్తున్న సేవా కార్యక్రామాలను ఆయన అభినందించారు. ప్రతి నిత్యం పేద వారి ఆకలి తీర్చేందుకు ఆహార క్యాంపులు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇప్పుడు రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ లు రక్తదాన ఆవశ్యకతను వివరించిన నాటి నుంచి తాను ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. స్వయంగా రక్తదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచిన మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఆసరాగా నిలిచేందుకు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.