రాజధాని తరలింపుపై కోర్టులో వ్యాజ్యం జరుగుతుండగానే మరిన్ని శాఖలు విశాఖ కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని జీవో నెంబర్ 13 ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ జీవో వెలువడగానే కోర్టులో కేసులు దాఖలు చేశారు.
అందువల్లే ఇంత కాలం ప్రభుత్వం జీవోలు ఇవ్వకుండా మౌఖికంగానే ఆదేశాలు ఇస్తూ వచ్చింది. తాజాగా ప్రధాన శాఖలు తరలించే బదులు ఉప శాఖలు తరలించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అంటే మునిసిపల్ వ్యవహారాల శాఖ లో టౌన్ ప్లానింగ్ లాంటి ఉప విభాగాలు ఉంటాయి. మరో ఉదాహరణగా చెప్పాంటే సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల విభాగం ఉంటుంది.
ఇలా ఈ ఉప విభాగాలను విశాఖ పట్నానికి తరలించాలని సిఎం ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. ఇలాంటి అరకొర నిర్ణయాలతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన పూర్తిగా స్తంభించి పోయింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చిన పనులు మాత్రమే జరుగుతున్నాయి.