ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా పంపిణీ చేసే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ఈ నెల 25 లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యా కమీషనరు ఉత్తర్వులు జారీ చేయడం ప్రస్తుత కరోనా మహమ్మారి మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది.
కరోనా మహమ్మారి ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో జనాలు గుమి కూడటం, అందులోనూ పాఠశాలల్లో చదివే చిన్నారులను పిలిచి పంపిణీ చేపట్టడం, వారిని ప్రమాదంలో కి నెట్టడమే అవుతుంది. అసలు విద్యా సంవత్సరం ప్రారంభానికే మానవ వనరుల శాఖ అనుమతి ఇవ్వనప్పుడు ఇంత హడావుడిగా పాఠ్య పుస్తకాల పంపిణీ ఎందుకో అదీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం ఏ రకంగానూ సమర్థ నీయం కాదు.
టీ వీ , ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పాలనుకున్నా అందుకు గానూ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని అనుకున్నా , విడతల వారీగా ,ఒకో పూట గంటగంట కూ చాలా చిన్న గ్రూపుల్లో తగు జాగ్రత్తలతో పంపిణీ చేయాలే గానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని అనడం అసంబద్ధం.
ఏదైనా పొరబాటు జరిగి ఎక్కడైనా విద్యార్థులకు, ,తల్లి దండ్రులకు , ఉపాధ్యాయులకు వైరస్ సోకితే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు. ఇప్పటికైనా అధికారులు పునరాలోచించి పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాలలు తెరిచే నాటికి వాయిదా వేయాలని డిటీఎఫ్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ జిల్లా అధ్యక్షులు మడావి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి యం రాజకమలాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
లేదా అంతగా అవసరం అనుకుంటే తరగతి వారీగా ఒకో రోజు పిల్లలు గుమికూడకుండా ప్రణాళిక తయారు చేసుకుని ఎలాంటి హడావిడి లేకుండా పంపిణీ చేయాలని అధికారులు ఉత్తర్వులివ్వాలని వారు కోరారు.