రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత హిట్లర్ ప్రపంచ గ్లోబును కాళ్ళతో తంతూ ఆటలాడినట్లు, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లో బంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటాడుతున్నారని, పవిత్రమైన అసెంబ్లీని పూర్తిగా రాజకీయవేదికగా మార్చారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెదేపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి వెళ్ళటం వలన కలిగే ప్రయోజనం శూన్యం అని, చంద్రబాబుపై అవినీతి నిందలు మోపే ప్రచార సభగా అసెంబ్లీ ని వాడుకునేందుకే ముఖ్యమంత్రి సమావేశాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
రాష్ట్రంలో ఐఎఎస్, ఐపిఎస్, న్యాయ వ్యవస్థ లను కూడా ముఖ్యమంత్రి నిర్వీర్యం చేశారన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత ఇప్పటికే అసెంబ్లీని కురు సభ గా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శాసనసభ లో మాట్లాడే అవకాశమే లేనప్పుడు, సభకు వెళ్ళటం అంటే ఎండమావుల్లో నీళ్ళు ఉంటాయని ఆశపడటం వంటిదే అన్నారు.
అధినేత చూపిన దారిలోనే అసెంబ్లీని బహిష్కరించటం ఉత్తమమైన నిర్ణయం అని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా అని చెప్పారు. వైసీపీ నాలుగేళ్ళ పాలనలో జరిగిన కుంభకోణాలపై, ఐఎఎస్ , ఐపిఎస్ అధికారుల చట్టబద్ద పాలనా తప్పిదాలపై న్యాయ స్థానాలో కేసులు వేయటం ద్వారా, రాజ్యాంగ వ్యవస్థలపై పోరాటం ద్వారా ప్రజలను సమీకరించాలని బాలకోటయ్య సూచించారు.