రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్టోగ్రతలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 11 గంటల దాటితే బయటకు వెళ్దామా? వద్దా ? అన్న ఆలోచనలో పడేస్తున్నాయి. మధ్యాహ్నం అయితే సుర్రుమంటున్నది. ఏ ఇద్దరు కలిసినా హీటెక్కిస్తున్న ఎండలపైనే చర్చించుకుంటున్నారు. ఉష్ణోగ్రతలు ఇలా అనూహ్యంగా పెరిగిపోతుండటానికి ఎల్ నినో కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈఏడాది తీవ్ర ఎండలు ఉంటాయని పేర్కొంటున్నారు. గడిచిన వారం రోజులుగా గరిష్ట ఉష్టోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్కు పైగానే నమోదవుతున్నది.
వేసవి మొదట్లోనే ఎండలు దంచి కొడుతుండగా.. లానినో వెళ్లిపోయి ఈసారి ఎల్నినో వచ్చినట్టుగా వాతావరణ నిపుణులు చెప్పారు. భూమధ్య రేఖ వెంట పసిఫిక్మహా సముద్రంపై అసాధరణ స్థాయిలో వేడి ఉత్పన్నమైతే ఎల్నినో.. అసాధారణ చల్లదనం ఏర్పడితే దానిని లానినో అంటారని తెలిపారు. వీటిని ఆసిలేషన్సిస్టమ్గా పిలుస్తారని వివరించారు. ఈ రెండు పరిణామాలు ప్రతీ మూడు నాలుగేళ్లకు భ్రమణంలో సంభవిస్తుంటాయని చెప్పారు. గడిచిన రెండున్నరేళ్లకు పైగా లానినో ఎఫెక్ట్ ఉండటంతోనే వర్షపాతం ఎక్కువగా నమోదైందన్నారు.
ఉష్ణోగ్రతలు కూడా మరీ అంత ఎక్కువగా లేవన్నారు. ప్రస్తుతం లా నినో వెళ్లిపోయి ఎల్నినో వచ్చిందని వివరించారు. ఫలితంగా ఈసారి ఎండలు ఏప్రిల్లో 44 డిగ్రీల సెల్సియస్కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని చెప్పారు. మేలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని.. చెబుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్దాటే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడానికి అడవులు అంతరిస్తుండటంతో పాటు వాతావరణ కాలుష్యం కర్బన ఉద్గారాలు కూడా కారణమని విశ్లేషించారు. ఏటా లక్షల సంఖ్యలో వాహనాలుపెరిగిపోతున్న కారణంగా ఏర్పడుతున్న కాలుష్యం, పరిశ్రమల నుంచి వస్తున్న పొల్యూషన్ మొత్తంగా వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయని పేర్కొంటున్నారు.