ప్రతిపక్షాలపైనా, ప్రతిపక్ష కార్యకర్తలపైనా, ప్రతిపక్షాల కార్యాలయాలపైనా నిత్యం దాడులు చేస్తున్న అధికార పక్షం తమకు విపక్షాల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం చేస్తున్నది. రాష్ట్రంలో కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల పై విపక్షాలు మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు దాడులుచేస్తారని జాగ్రత్తగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు తీవ్ర ప్రచారం జరుగుతున్నది.
మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు సూచించినట్లు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయంపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు.
ఒక్కసారిగా 30 మంది వైకాపా కార్యకర్తలు జనసేన కార్యాలయంలోకి దూసుకొచ్చి వీరంగం సృష్టించారు. కార్యాలయంలో కుర్చీలు, బల్లలు విరగొట్టారు. ఫర్నిచర్ను కర్రలతో కొడుతూ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైకాపా కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
ఎమ్మెల్సీ దువ్వాడ అనుచరులే దాడికి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. జరిగింది ఇది కాగా టెక్కలి జనసేన కార్యాలయంపై దాడి ఘటనకు ప్రతీకార దాడి జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం జరుగుతున్నది.