శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడం కోసం పలు ప్రాంతాలలో కార్డన్ అండ్ సెర్చి నిర్వహిస్తున్నామని నిర్మల్ ఎస్ పి సి.శశిధర్ రాజు అన్నారు. నేడు దిలావర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సిర్గాపూర గ్రామంలో కార్డన్ సెర్చి నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలతో పాటు అనుమతి లేని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనుక్షణం పోలీసు నిఘా ఉంటుందని, బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ బృందాలు ప్రజల భద్రత కోసం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నేరస్తుల కదలికపై నిఘా కొనసాగిస్తాయని ఆయన అన్నారు.
పటిష్టమైన నేర నివారణ చర్యలలో భాగంగా గ్రామంలో అందరూ కలిసి ముఖ్య కూడలిల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్ పి సూచించారు. ఎలాంటి అత్యవసర సమయంలో అయిన డయల్ 100 కు గాని, సమీప పోలీస్ స్టేషన్ కు గాని సమాచారం అందించవచ్చునని ఆయన సూచించారు.
సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలను అధిక వేగంగా నడిపి ప్రమాదాలకు కారకులుగా మారవద్దని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, DSP ఉపేందర్ రెడ్డి, సి.ఐ.లు శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, RI వెంకటి, ఎస్.ఐ.లు దాదాపు 100 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.