ఆర్వీఎం ఆసుపత్రిలో ఆర్టిపిసిఆర్ టెస్టింగ్ సెంటర్ ని ప్రారంభించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ని నేడు మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డిసి ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆర్వీఎం ట్రస్ట్ ఛైర్మెన్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ఆర్టిపిసిఆర్ కేంద్రాన్ని ప్రారంభించనుందని మంత్రి అన్నారు. త్వరలో అనుమతుల అనంతరం సిద్దిపేట మెడికల్ కళాశాలలో ఆర్టిపిసిఆర్ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు.
ఆర్వీఎం ఆసుపత్రిలో చుట్టూ పక్కల గ్రామాల్లోని ప్రజలు వచ్చి టెస్టులు చేయించుకోవాలని మంత్రి కోరారు. కోవిడ్ పేషంట్లకు ఆర్వీఎం ఆసుపత్రిలో చాలా వసతులను ఉచితంగా అందిస్తున్నామని, కాబట్టి ఎవరు కూడా కార్పొరేట్ ఆసుపత్రిల్లోకి వెళ్లవద్దని ఆయన కోరారు.
ఇప్పుడు జిల్లాలో రాపిడ్ టెస్టులకు ఐదు వేల కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. కరోనా అనేది మనిషి చనిపోయే రోగం కాదని ఆ లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. 25,26 వేల రూపాయలతో కూడిన కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
కోవిడ్ పేషంట్లకే కాదు, డాక్టర్లకు, నర్సులకు అందరికి కూడా ప్రభుత్వం రక్షణగా ఉంటుందని ఆయన అన్నారు.