కరోనా కట్టడిపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. సమూహాలను నియంత్రించాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసరాలకు మాత్రమే అనుమతులు ఉంటాయని స్పష్టం చేసింది. జిల్లా పోలీసులు, మున్సిపల్ అధికారులు నియంత్రణ చర్యలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.
సంబంధిత అధికారులను జవాబుదారీగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పరిస్థితిని బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్థానికంగా ఆంక్షలు విధించుకోవచ్చని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లకే వీటిని పరిమితం చేయాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్ ఆవల లాక్డౌన్ విధించాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయని తెలిపింది. కరోనా విషయంలో ఇటీవల సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకోవాలని హోంశాఖ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కార్యాలయాల్లోనూ భౌతికదూరం సాధ్యమయ్యే విధంగా చర్యలు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఒకవారంలో పాజిటివ్ రేటు 10 శాతం దాటిన ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.