ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు . అనేక మంది ప్రాణత్యాగం తో ఏర్పడిన తెలంగాణ చివరకు ఒక కుటుంబానికి పరిమితమందని దుయ్యబట్టారు . రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని , సంక్షేమ పాలన అంటూ సంక్షోభం దిశగా పాలన సాగుతుందని విమర్శలు గుప్పించారు.
పోలీసు అధికారులు, వారి కనుసన్నల్లో పని చేసేలా కేసీఆర్ కుటుంబం చేసుకుందని విమర్శలు చేశారు . తెలంగాణలో దళితబంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందన్నారు. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాఫియా మాదిరి బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని అన్నారు.