‘శుభలగ్నం’ సినిమా గుర్తుందా? జగపతిబాబు, ఆమని, రోజా అందులో నటించారు. ఆమని డబ్బు కోసం తన భర్తను రోజాకు అమ్మేస్తుంది. సరిగ్గా ఇలాంటి పనే మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది.
అయితే ఆ సినిమాలో ఆమని డబ్బుపై వ్యామోహంతో అలా చేయగా ఈ భోపాల్ ఆమని మాత్రం తన పిల్లల కోసం భర్తను విక్రయించేసింది.
భోపాల్ లో జరిగిన ఈ ఘటనలో ఒక భార్య తన భర్తను కోటిన్నర రూపాయలకు ప్రియురాలికి అమ్మేసింది. భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన ఓ బాలిక, తన తండ్రి ఓ మహిళతో వివాహేతర బంధం పెట్టుకుని, ఇంట్లో ప్రశాంతత లేకుండా చేశాడని తెలిపింది.
తరచూ తల్లితో గొడవ పడుతున్నాడని కూడా కోర్టుకు ఫిర్యాదు చేసింది. వారిద్దరి గొడవలతో తనకు, తన చెల్లెలికి చదువుపై ఆసక్తి ఉండటం లేదని చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్ కు పిలిపించగా, అతని వివాహేతర బంధం నిజమేనని తేలింది.
అయితే, అతను ప్రియురాలితోనే ఉండాలని భావిస్తున్నట్టు చెప్పాడు. విడాకులు ఇచ్చేందుకు తొలుత అంగీకరించని భార్య, చివరకు తన బిడ్డల భవిష్యత్తు కోసం సంచలన నిర్ణయం తీసుకుంది.
తనకు ఇల్లు, పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని కోరగా, అందుకు భర్త ప్రియురాలు అంగీకరించింది. మొత్తం కోటిన్నర రూపాయలు ఇచ్చింది. ఈ డబ్బులతో తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటానని ఆమె చెప్పింది.