దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుకోసం అధికార టీఆర్ ఎస్ పడరాని పాట్లు పడుతోంది. అందిన ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుంది. అయితే అధికార పార్టీ తన ధన బలానికి తోడు అధికార బలగాన్ని కూడా వాడుకుంటోందని ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి.
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు సైతం టీఆర్ ఎస్ నేతలకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సిద్దిపేటలో జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు. దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో హైడ్రామాకు తెరతీశారు పోలీసులు.
దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువు అంజన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే వారి పక్క ఇంట్లో కూడా సోదాలు చేశారు. రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బులు ఏమీ దొరకలేవని, కానీ ఆపక్కవారి ఇంట్లో మాత్రం రూ.18లక్షల 65 వేలు దొరికినట్లు సమాచారం.
అక్కడి నుండి అవే డబ్బులు ఓబ్యాగులో తీసుకువచ్చి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బులు దొరికినట్లు చూపేందుకు పోలీసులు ప్రయత్నం చేసినట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
దోచుకున్నోడికి దోచుకున్నంత..
సిద్దిపేటలో పోలీసులు రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బులు దొరికినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అవన్నీ అవాస్తవాలే అని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులే డబ్బులు తెచ్చి ఇక్కడ దొరికినట్లు డ్రామాలు ఆడుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు హంగామా చేశారు.
దీంతో రఘునందన్ రావు బంధువుల ఇంటి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒకానొక దశలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇదే అదునుగా అక్కడే ఉంచిన బ్యాగులో నుండి బీజేపీ కార్యకర్తలు అందినకాడికి పట్టుకువెళ్లారు.
ఏది నిజం.. ఏది అబద్ధం???
దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో కాదని, సిద్దిపేట పట్టణంలో అదీ ఇండ్లలో సోదాలు నిర్వహించడం ఎంటన్నదానిపై పోలీసుల వద్ద కూడా సమాధానం లేదు. సాధారణంగా ఎన్నికలంటే పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుంటారు.
కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఇండ్లలో సోదాలు నిర్వహించడం ఏంటన్నదానిపై పోలీసులు నోరు మెదపడం లేదు. సిద్దిపేటలో ఇండ్లలో సోదాలు చేపట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లపైనే ఎందుకు దాడులు, సోదాలు చేస్తున్నారన్న విమర్శలకు సమాధానంగా పోలీసులు మరో డ్రామాకు తెరతీశారు. టీఆర్ ఎస్ నాయకుడు, రాజనర్సు ఇంటిపై కూడా సోదాలు చేశారు పోలీసులు.
బీజేపీ నేతల అరెస్ట్..
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారానికి అడుగడుగునా అడ్డుపడుతున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్న పోలీసులపై.. ఇప్పుడు వారే స్వయంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బంధువుల ఇండ్లలో డబ్బులు పెట్టి వారిని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసుల విషయం తెలుసుకుని సిద్దిపేటకు వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను, మాజీ ఎంపీలు వివేక్, రంజిత్ రెడ్డిలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో సిద్దిపేటలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ అరెస్ట్ లపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.