తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం ఘనంగా జరిగింది. జీయర్స్వాముల వెంట పండితులు చక్కటి స్వరంతో దివ్యప్రబంధ పారాయణం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, సి.వెంకటప్రసాద్ కుమార్, ఆలయ డెప్యూటి ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, హెచ్డిపిపి కార్యదర్శి రాజగోపాలన్ తదితరులు పాల్గొన్నారు.