గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 591 దేవాలయాల పునరుద్దరణ, నూతన దేవాలయాల నిర్మాణానికి రూ.311 కోట్ల సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అయితే షరతులకు లోబడి ఇప్పటి వరకూ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టని, నిర్మాణ పనులు ప్రారంభించని దేవాలయాలకు నోటీసులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ప్రతి వారం మాదిరిగానే నేడు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉద్యోగులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నున్న పలు పురాతన ఆలయాల పునరుద్దరణకు మరియు నూతన దేవాలయాల నిర్మాణానికి సి.జి.ఎఫ్. నిధులు మంజూరు చేస్తామన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేసేందుకు ముందుగా మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టాలని, దేవాలయ నిర్మాణ పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే కొన్ని షరతులతో ప్రొసీడింగ్స్ జారీ చేశామన్నారు. సి.జి.ఎప్. నిధుల మంజూరీకై ప్రొసీడింగ్స్ జారీచేసిన రెండేళ్ల కాల వ్యవధిలో మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టకుండా, దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఆయా దేవాలయాలకు సంబందించిన సి.జి.ఎఫ్. నిధుల మంజూరు ఆటోమేటిక్ గా రద్దైనట్లు భావిస్తామన్నారు. అటు వంటి దేవాలయాలకు సంబంధించి నూతన అంచనాలతో తిరిగి ప్రతిపాదిస్తే, నూతన ఎస్.ఎస్.ఆర్. రేట్ల ప్రకారం తిరిగి మంజూరు చేస్తామన్నారు.
కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల అమలుకు చర్యలు
ఈ నెల 12 న జరిగిన కేబినెట్ సమావేశంలో దేవాదాయ శాఖకు సంబంధించి రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. పలు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా శారీరకంగా దృడంగా ఉన్నంతవరకూ అర్చకులుగా కొనసాగేలా మరియు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకోవడం జరిగిందన్నారు.
అదే విధంగా వంశపారపర్యంగా అర్చకత్వానికి అనుమతించడం జరిగిందని, అయితే అందుకు కొన్ని మాసాలు శిక్షణ ఇచ్చిన తదుపరి అర్హత పరీక్షను నిర్వహించడం జరుగుతుందని, అందులో ఉత్తీర్ణులు అయిన వారినే అర్చకులుగా తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేబినెట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలను అమలు చేసే దిశగా నేడు జరిగిన సమీక్షా సమావేశంలో చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి హామీ ప్రకారం అర్చకుల వేతనాలు పెంపు
అర్చకుల వేతనాల పెంపు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జి.ఓ.ఎం.ఎస్. నెం.52/2021 ను జారీచేయడమైందన్నారు. ఈ జి.ఓ. ప్రకారం ఇప్పటికే రూ.5 వేల వేతనాన్ని తీసుకుంటున్న అర్చకుల వేతనాన్ని రూ. 10 వేలకు మరియు రూ.10 వేల వేతనం తీసుకుంటున్న అర్చకుల వేతనాన్ని రూ.15,650/- పెంచినట్టు ఆయన తెలిపారు. ఈ రెండు కేటగిరీల వేతనాలను ఇప్పటి వరకూ మొత్తం 3,208 మందికి వర్తింప చేయడం జరిగిందని, వీరిలో జి.ఓ. జారీకి ముందున్న 2,032 మంది మరియు జి.ఓ. జారీ తదుపరి మరో 1,176 మంది అర్చకులు ఉన్నట్లు ఆయన తెలిపారు.
విస్తృత స్థాయిలో ధూపదీపనైవేధ్య పథకం అమలు
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ధూప దీప నైవేధ్య పథకాన్ని విస్తృత స్థాయిలో అమలు పర్చడం జరుగుచున్నదని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం 1,561 దేవాలయాలకు మాత్రమే ఈ పథకం అమలు చేయడం జరిగేదని, కానీ తమ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 4,681 దేవాలయాలకు ఈ పథకాన్ని విస్తరించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో నూతన దేవాలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు భారీ స్థాయిలో నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక్కొక్క దేవాలయానికి రూ.10 లక్షల చొప్పును మొత్తం 1,917 దేవాలయాలకు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిలో 204 దేవాలయాల నిర్మాణ పనులు పూర్తయినాయని, 890 దేవాలయాల నిర్మాణ పనులు ప్రగతిలో నున్నాయని మరో 823 దేవాలయాల నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా మరో 873 దేవాలయాలకు శ్రీవాణి ట్రస్టు నిధులు మంజూరు చేయాలని టి.టి.డి. ఇ.ఓ.కి ప్రతిపాదనలు పంపడమైనది, దాన్ని వారు సానుకూలంగా స్పందిస్తూ రెండుమూడు రోజుల్లో మంజూరు చేస్తామని తెలిపారని ఆయన అన్నారు.
మొత్తం ఈ 2,790 దేవాలయాల నిర్మాణాలు పూర్తి అయిన వెంటనే స్థానికంగా ఉండే బ్రాహ్మణులను అర్చకులుగా నియమించడం జరుగుతుందన్నారు. అయితే ఎస్.సి., ఎస్.టి., మరియు బి.సి. ప్రాంతాల్లో ఉత్సాహం ఉన్న వారికి అర్చక అకాడమీలో శిక్షణ నిచ్చి అర్చకులుగా నియమించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ 2,790 దేవాలయాలకు కూడా ధూప ధీప నైవేధ్య పథకాన్ని వర్తింపచేయడం జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి తెలిపారు .