నిరుద్యోగ యువతకు కీలక రంగాల్లో శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దాలని భావించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 2013లో గుజరాత్లో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో సీమెన్స్ కంపెనీ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల బాధ్యత గుజరాత్ సర్కారుది. శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ను సమకూర్చే బాధ్యత సీమెన్స్ కంపెనీది. ఆ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు విజయవంతమయ్యాక దీన్ని గుజరాత్ మోడల్గా చూపిస్తూ సీమెన్స్ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టాలనుకుంది.
ఇదే ప్రతిపాదన సీమెన్స్ కంపెనీ ఏపీ సర్కారుకు ప్రజెంటేషన్ ఇచ్చింది. దీంతో రాష్ట్రానికి చెందిన నిపుణుల బృందం గుజరాత్ రాష్ట్రానికి వెళ్లి అక్కడి సీమెన్స్ ప్రాజెక్టును పరిశీలించి వచ్చారు. ఆ ప్రాజెక్టు పనితీరు, ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని, ఏపీలోనూ నెలకొల్పాలని సర్కారుకు నివేదించారు. తమ ప్రాజెక్ట్ పై సీమెన్స్ సమగ్ర నివేదిక ఇవ్వటంతో, ఫిబ్రవరి 16 2015న, జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని తీర్మానించారు. 2015 జూన్ లో ఈ ప్రాజెక్టు అమలుపై స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్కు, సీమెన్స్, డిజైన్టెక్ కంపెనీల మధ్య ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
సీమెన్స్ ప్రాజెక్టులో 6 క్లస్టర్లు ఉంటాయి. ఒక్కో క్లస్టర్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, 5 స్కిల్ డెవల్పమెంట్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఒక్కో క్లస్టర్ వ్యయం 559 కోట్లు. 6 క్లస్టర్ల ప్రాజెక్టు మొత్తం విలువ 3,356 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం. పన్నులతో కలిపి ఈ మొత్తం 370 కోట్లు. మిగిలిన 90 శాతం వ్యయం సీమెన్స్ కంపెనీదే. సీమెన్స్ తన వాటాగా డబ్బు కాకుండా అంత విలువైన వివిధ ఉత్పత్తుల సాఫ్ట్వేర్, కోర్స్ మెటీరియల్, హార్డ్వేర్ను సమకూరుస్తుంది. డిజైన్ టెక్ అనే సంస్థ (పుణె) సీమెన్స్కు అనుసంధానకర్తగా పనిచేస్తుంది.
శిక్షణా కేంద్రాలను నెలకొల్పడం, అవసరమైన సదుపాయాలు కల్పించడం, సిబ్బందితో శిక్షణ ఇప్పించడం ఆ సంస్థ బాధ్యత. తమకు ప్రాజెక్టు వ్యయంలో ఏపీ ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను ముందుగానే చెల్లించాలని సీమెన్స్ కంపెనీ కోరింది. ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. 2015 అక్టోబరు 10న (జీఓ నెం.8) ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ కమిటీలో సభ్యులుగా ఐఏఎస్ అధికారులు ముద్దాడ రవిచంద్ర, ఎస్ఎస్ రావత్, అజయ్జైన్, ఉదయలక్ష్మి, లక్ష్మీనారాయణతో పాటు సాంకేతిక నిపుణుడు గంటా సుబ్బారావు, సీమెన్స్, డిజైన్టెక్ ప్రతినిధులు ఉన్నారు. ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ ఈ కమిటీ బాధ్యత. స్కిల్ డెవల్పమెంట్ సెంటర్ల ఏర్పాటు పర్యవేక్షణకు మరో కమిటీని నియమించారు. ఇందులో ఎస్ఎస్ రావత్, అజయ్జైన్, ఉదయలక్ష్మి, లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు సభ్యులుగా ఉన్నారు. 2015 నవంబరు 5-6 తేదీల్లో ఐఏఎస్ అధికారుల కమిటీ గుజరాత్లోని సీమెన్స్ కేంద్రాలను సందర్శించింది. అక్కడి విధానాలను అధ్యయనం చేసి, అదే ఏడాది నవంబరు 7వ తేదీన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సీమెన్స్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని సిఫారసు చేసింది.
అంతే కాకుండా… కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) సంస్థతో సీమెన్స్ ప్రాజెక్టు వాస్తవ విలువను మదింపు చేయించారు. ప్రాజెక్ట్ మొత్తం పెర్ఫెక్ట్ గా ఉందని 2016 మార్చి 18న సీఐటీడీ నివేదిక ఇచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు పై జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు, కట్టుకథలే. అత్యంత ప్రయోజనాత్మకంగా నడుస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ ప్రజెక్టుపై జగన్ రెడ్డి అసెంబ్లీలో అసత్య ఆరోపణలు చేశారు.
ఏపీ తరహాలోనే తమిళనాడు, కర్నాటక, జార్ఖండ్ ప్రభుత్వాలు టెండర్లు లేకుండానే ఒప్పందాలు చేసుకొన్నాయి. ఏపీ ప్రభుత్వ వాటా కేవలం 10 శాతం మాత్రమే. గుజరాత్, కర్నాటక రాష్ట్రాల వాటా 20 శాతంతో ఒప్పందాలు చేసుకొన్నాయి. ఈ విషయాలు జగన్ రెడ్డి తెలిసీ కావాలనే తన కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి అసత్య ఆరోపణలు చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో 40 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయకపోతే వాటికి పరికరాలు, సాప్ట్ వేర్ తగు సిబ్బంది నియామకాలు చేయకపోతే 2.94 లక్షల మందికి ఎలా శిక్షణ ఇవ్వగలరు? వారిలో 64 వేల మందికి ఉద్యోగాలు కల్పించింది నిజం కాదా? అవే సెంటర్లను ఈ నాలుగేళ్ల నుండి వాడుకుంటున్నది నిజం కాదా?
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీతో సహా 40 కాలేజీలు, యూనివర్శిటీలు తమకు సీమెన్స్ సమకూర్చిన పరికరాలు స్టాక్ రిజిస్టార్ లు జగన్ రెడ్డి ప్రభుత్వం వద్ద ఉన్నది నిజం. జగన్ రెడ్డి దగ్గర ఆధారాలు ఉంటే చంద్రబాబు ఏ అకౌంట్ కు వచ్చాయో ఎందుకు బయటపెట్టడం లేదు? లేని అవినీతిని చంద్రబాబుకు అంటగట్టడానికి జగన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
తన లక్షల కోట్ల కుంభకోణాన్ని కప్పెట్టుకోవడానికి ఎదుటివారికి అవినీతి బురద పూసి అందరూ అవినీతిపరులేనని నమ్మించే కుటిల ప్రయత్నం చేస్తున్నాడు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా తన కంపెనీల్లోకి అవినీతి సొమ్ము మళ్లించుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. క్విడ్ ప్రోకో ద్వారా రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడి 12 సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నది జగన్ రెడ్డి.
2004 లో హైదరాబాద్ లో ఉన్న ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ రెడ్డి కేవలం 18 ఏళ్లలోనే లక్షల కోట్ల ఆస్తికి యజమాని ఎలా అయ్యాడు? జగన్ రెడ్డికి 16 కంపెనీలు, సంస్థలు ఉన్నది వాస్తవం కాదా? బెంగళూరు, పులివెందుల, ఇడుపులపాయ, చైన్నై, తాడేపల్లిలలో రాజభవనాలను మించిన ప్యాలెస్ లు ఎలా వచ్చాయి. ఈ బురదను ఎదుటి వారికి అంటించడానికే సాక్షి మీడియా చివరకు అసెంబ్లీని, సీఐడీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు.
స్కిల్ డెవల్పమెంట్ కేసులో జరుగుతున్న విచారణలో తమకు బాగా కావాల్సిన వారి విషయంలో ఒకలా, ఇతరుల విషయంలో మరోలా వ్యవహరిస్తోంది.
సీమెన్స్ ప్రాజెక్టులో ప్రభుత్వం తరపున కార్యదర్శిగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, ఆనాటి స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణపై కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవల్పమెంట్ ముఖ్య కార్యదర్శిగా నిధులు విడుదల చేసిన ఎల్.ప్రేమ్చంద్రారెడ్డిని మాత్రం విచారణ చేయలేదు. జగన్ రెడ్డిది అన్నింటా పక్షపాతమే….యువతకు మేలు చేసి చంద్రబాబు అవినీతి ఆరోపణలు మోయడమే నేటి ట్రాజెడీ.