మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు ప్రాణాలకు విలువ తెలియని రాక్షసులని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు కలిసి తనను పుంగనూరులో అడ్డుకోవాలని చూశారని చంద్రబాబు తెలిపారు. వీళ్లు మానవ మృగాలు. డబ్బు కోసం దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నారు. పెద్దిరెడ్డికి జిల్లా ఎస్పీ ఊడిగం చేస్తున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రౌడీలను పెట్టి నన్ను అడ్డుకోవాలని చూస్తే.. పెద్దిరెడ్డికి ఇదే చివరి రోజు అవుతుందని ఆయన అన్నారు.
నన్ను కట్టడి చేయడం నీ వల్ల కాదు.. నీ సైకో వల్ల కాదు. నా మీద దాడి చేసి మీరు బంద్కు పిలుపు ఇవ్వడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ను ఎస్పీ చదివారని ఆయన తెలిపారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తా. ఎన్ఎస్జీ భద్రత లేకపోతే నా మీద కూడా గొడ్డలి వేటు వేసేవారేమో? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
మళ్లీ గెలవబోమని వైసీపీ నాయకులకు అర్థమైంది అందుకే ఘోరాలకు ఒడిగడుతున్నారని ఆయన అన్నారు. పులివెందుల చక్రాయపేట నుంచి తంబళ్లపల్లికి నీటి తరలింపు పేరుతో పెద్దిరెడ్డి రూ.5036 కోట్ల అనుమతులు మంజూరు చేయించుకున్నాడు. పెద్దిరెడ్డి మంత్రా.. లేక కాంట్రాక్టరా? ఉన్న కాలువను నిర్వీర్యం చేసి దోపిడీ కోసమే సొంత సంస్థ ద్వారా కొత్త కాలువ తవ్వుతున్నారు. కమీషన్ల కక్కుర్తి కోసమే ఈ దోపిడీ చేస్తున్నారు. రైతుల్ని బెదిరించి బలవంతంగా భూములు లాక్కున్నారు. హంద్రీనీవా పూర్తి చేయకుండా రూ.5036 కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారని చంద్రబాబు తెలిపారు.