విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణమని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. రాజాంలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (58) శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అక్కడి పరిస్థితులను చూసి ఇది హత్యేనని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది. మృతుడి కుమారుడు శ్రావణ్కుమార్ ఫిర్యాదు మేరకు తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.