విచారణల పేరుతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను ప్రభుత్వం వేధింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు.
వైసీపీ సృష్టించిన కృత్రిమ ఇసుక కొరతతో ఉపాధి లేక, తిండికి కూడా అవస్థలు పడుతున్నామనే ఆవేదనతోనే మంత్రి పేర్ని నానిపై భవన నిర్మాణ కార్మికుడు నాగేశ్వరరావు దాడికి పాల్పడ్డాడని ఆయన అన్నారు. ఆ ఘటనను టీడీపీ కూడా తీవ్రంగా ఖండించిందని చంద్రబాబు తెలిపారు.
ఆ కేసును కూడా టీడీపీ నేతలకు ఆపాదించడం, టీడీపీకి సంబంధించిన వారే హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని చంద్రబాబునాయుడు అన్నారు. ఒక భవన నిర్మాణ కార్మికుడు చేసిన దాడి కేసులో వివాద రహితుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను విచారణకు రావాలని పిలవడం ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే.
పేర్ని నానిపై దాడికి, టీడీపీకి సంబంధం ఏమిటి.? రాష్ట్రంలో ఏం జరిగినా టీడీపీ నాయకులకే ముడిపెడతారా? బీసీలపై ఇంత కక్ష సాధింపులు ఎందుకు? దాడికి పాల్పడిన వ్యక్తిని విచారించి మీరు చర్యలు తీసుకుంటే ఎవరు అడ్డుకుంటారు? గతంలో కూడా కుటుంబ కలహాలతో జరిగిన హత్య కేసును కొల్లు రవీంద్రకు ఆపాదించి అరెస్టు చేశారు.
ఇప్పుడు కూడా అదే పద్దతిలో వ్యవహరిస్తున్నారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి అణగదొక్కాలనే వైసీపీ ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలను ప్రజలు క్షమించరని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.