పొట్టి శ్రీరాములు త్యాగం ప్రజలలో గుర్తుండి పోయేలా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం ను అధికారికంగా నిర్వహించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ వూసే ఎత్తలేదని, రాష్ట్ర విభజన రోజును సైతం దిక్కుమాలిన నవ నిర్మాణ దీక్షలు చేశారని మంత్రి అన్నారు.
విజయవాడ వన్ టౌన్ సౌమరంగ చౌక్ లో శ్రీ వాసవీ ఫౌండేషన్, వాసవీసేవాదళ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్ని వర్గాల వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని మంత్రి వెల్లడించారు.