ఉత్తరాఖండ్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం మెరుగుపడే వరకు ఎక్కడికీ వెళ్లవద్దని చార్ధమ్ యాత్రికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రిషికేశ్లోని చంద్రభాగ వంతెన, తపోవన్, లక్ష్మణ్ జూలా, ముని-కి-రేతి భద్రకాళి వైపు ప్రయాణికుల వాహనాలు అనుమతించడం లేదు.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సచివాలయంలో పరిస్థితులను సమీక్షించారు. యాత్రికులు వాతావరణం సాధారణమయ్యే వరకు రెండు రోజుల పాటు తమ ప్రయాణాన్ని వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాత్రికులు హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, టెహ్రీ, ఉత్తరకాశి, రుద్రప్రయాగ్, గుప్తకాశి, ఉఖిమఠ్, కర్ణప్రయాగ్, జోషిమఠ్, పాండకేశ్వర్ అంతటా సురక్షితమైన ప్రదేశాలలో ఉన్నారని తెలిపారు.
యమునోత్రికి వెళ్లే యాత్రికులు బాద్కోట్, జంకిచట్టిలో ఉండాలని కోరారు. అయితే గంగోత్రికి వెళ్లేవారు హర్సిల్, భట్వారీ, మానేరిలో ఉండాలన్నారు. కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లే యాత్రికులు కూడా వాతావరణ పరిస్థితులు మెరుగయ్యే వరకు తమ ప్రయాణాన్ని కొనసాగించవద్దని అభ్యర్థించారు. బద్రీనాథ్ మార్గంలో చాలా మంది యాత్రికులు జోషిమఠ్, చమోలిలో ఉన్నారు.