మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఐజీ మురుగన్పై 112 పేజీల అభియోగపత్రాన్ని పోలీసులు ఎగ్మూర్ కోర్టులో దాఖలు చేశారు. ఈరోడ్ టాస్క్ఫోర్స్ ఐజీగా ఉన్న ఐపీఎస్ అధికారి మురుగన్ (59) చెన్నైలో అవినీతి నిరోధకశాఖ అధికారిగా ఉన్న సమయంలో ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2017 నుంచి 2018 వరకు పలుమార్లు ఆమె సెల్ఫోన్కు అసభ్యకర సమాచారం పంపడం, ఒంటరిగా గదికి పిలిపించి హద్దులుమీరి ప్రవర్తించినట్లు ఆధారాలు ఉన్నాయి.
బాధితురాలి ఫిర్యాదుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖ కమిటీ విచారణ జరిపింది. సీబీసీఐడీ దర్యాప్తు చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని బాధితురాలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్ విచారణ 2019లో తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయింది. అదేవిధంగా సీబీసీఐడీ పోలీసులు ఐజీ మురుగన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 2021లో ఈ కేసుని తమిళనాడులో విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐజీ మురుగన్ ఐపీఎస్ అధికారి కావడంతో అతనిపై కోర్టు చర్యలను చేపట్టేందుకు, అభియోగపత్రం దాఖలు చేసేందుకు అనుమతివ్వాలని గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి సీబీసీఐడీ లేఖ రాసింది. అనుమతి లభించడంతో ఎగ్మూర్ కోర్టులో 20 మంది సాక్ష్యులను దర్యాప్తు చేసి వారి వాగ్మూలం నమోదు చేసిన పత్రాలు సహా 112 పేజీల అభియోగపత్రాన్ని దాఖలు చేశారు.