మ్యాట్రిమొనీలో అందమైన ఫొటోలు పెట్టి ,తనకు రూ. 100 కోట్ల ఆస్తి ఉందని యువతులను నమ్మించి పెళ్లి పేరుతో మోసగిస్తున్న ఓ కేటుగాడిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. రూ.లక్షలు దోచేసి విమానం ఎక్కి దేశాన్ని దాటే క్రమంలో గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చొరవతో పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. సేకరించిన సమాచారం ప్రకారం గుంటూరుకు చెందిన ఓ యువతి లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది.
ఆమెకు వివాహం చేయాలని తల్లి ప్రయత్నాలు ప్రారంభించింది. విషయం తెలిసిన హైదరాబాద్కు చెందిన ఈ యువకుడు తాను పెళ్లి చేసుకుంటానని ఆస్తి, జీతంపై మాయమాటలు చెప్పాడు. గుంటూరులో ఇల్లు కొనేందుకు రూ. కోటి పంపుతానన్నాడు. ముందుగా తమ మధ్య బ్యాంకు లావాదేవీలు జరగాలని చెప్పాడు. అలా విడతల వారీగా రూ.25 లక్షలు జమ చేయించుకున్నాడు. ఇల్లు కొనే ప్రక్రియలో భాగంగా యజమాని డబ్బులు అడిగాడు.
ఒక్కసారిగా రూ.కోటి ఇవ్వకూడదని,ముందు తన ఖాతాలోకి రూ. 2 లక్షలు పంపాలని చెప్పాడు దాంతో అందరికీ అనుమానం వచ్చింది. పోలీసులకు విషయం చేరడంతో నిందితుడిని గాలించి పట్టుకున్నారు. ఈ మోసగాడు ఇదే తరహాలో 20 రోజుల కిందట విశాఖలో ఓ వైద్యురాలిని పెళ్లి చేసుకొని…మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు.