విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి 23వ జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.
దీనికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఏటా శివరాత్రి తరువాత వచ్చే ఆదివారం ప్రారంభమై మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పట్టణ శివారున విశాల ప్రాంగణంలో అమ్మవారి దేవస్థానం ఉండటంతో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు విజయనగరం పార్లమెంట్ సభ్యులు, బెల్లాన చంద్రశేఖర్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించి, జాతరను ప్రారంభించారు.
జాతర సందర్భంగా చీపురుపల్లి పట్టణంలో నూతన శోభ సంతరించుకుంది.ఈ ఏడాది బాహుబలి ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విద్యుత్తు దీపాల అలంకరణతో పట్టణం మెరిసిపోయేలా చేశారు.
ప్రధాన రహదారులను శోభాయమానంగా తీర్చదిద్దారు.
అమ్మవారి దేవస్థానం నుంచి శ్రీకాకుళం రహదారి మీదుగా మూడు రహదారుల కూడలి, విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారుల పొడుగునా విద్యుత్తు దీపాలతో అలంకరించారు.
భారీ సెట్టింగులను ఏర్పాటు చేశారు.మూడు రోజుల పాటు సుమారు 3 లక్షల వరకు భక్తులు హాజరై అమ్మవారిని దర్శించి, జాతరను తిలకించనున్నారని అంచనా.
మూడు రోజుల జాతర నిర్వహణ లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏపీ, తెలంగాణ, ఒడిశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల రీత్యా వెళ్లిన వారంతా విధిగా హాజరవుతుంటారు.