డీపీఓలోతెలుగు భాష అమలుపై అధికార భాషా సంఘం సమీక్ష…!
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచీ అన్ని ప్రత్యుత్తరాలు..తెలుగులోనే జరుగుతున్నాయని జిల్లా పోలీస్ బాస్…ఎస్పీ దీపిక తెలిపారు. డీపీఓ లో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షతన….పోలీస్ శాఖ తెలుగు అమలు..తీరు తెన్నులపై సీఐ స్థాయి అదికారులతో సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ – ఎవరు ఎన్ని సంవత్సరాలు పాలన చేసినా, సమాజ శ్రేయస్సుకు, సాహిత్య, సంప్రదాయాలను ప్రోత్సహించే వారే ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హెూదాను తీసుకొని వచ్చేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి విశేషంగా కృషి చేసి, సఫలీకృతులయ్యారన్నారు.
సీఎం జగన్ రాష్ట్రంలో తెలుగు అకాడమీని, అధికార భాషా సంఘంను పునరుద్ధరించారన్నారు. అంతేకాకుండా, ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రంను రాష్ట్రానికి తీసుకొని వచ్చారన్నారు. అవసరాలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి విచ్చేసే ప్రజలకు అర్ధం అయ్యేందుకు వేరే భాషలో అక్కడక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ, స్థానిక ప్రజలకు సులువుగా అర్ధమయ్యేందుకు తెలుగు భాషలోనే కార్యాలయ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషగా తెలుగును ప్రోత్సహించేందుకు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అంతేకాకుండా, తెలుగు భాషను పాలనా భాషగా వినియోగించని వారిపై చర్యలు తీసుకొనే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు.
సంస్థల యాజమానుల నామ ఫలకాలను, శంకు స్థాపన లేదా ప్రారంభోత్సవ శిలా ఫలకాలను తెలుగులోనే జరపాలని అధికారులను కోరారు. జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసు కార్యాలయం నుండి జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలన్నియూ దాదాపు తెలుగులోనే నిర్వహిస్తున్నామన్నారు. మాతృ భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం వలన భావాన్ని సులువుగా, ఖచ్చితం గా వ్యక్తం చేసే అవకాశం ఉంటుందన్నారు.
కేసు ఫైల్స్ ను కూడా తెలుగులోనే వ్రాసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలుగు భాషను పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు ప్రారంభోపన్యాసం చేసారు.
తెలుగు, హిందీ సాహిత్యానికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. అనంతరం, తెలుగు భాషా సంఘం అధ్యక్షులు మరియు ఇతర సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్ చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, డిపిఓ పరిపాలనాధికారి వెంకట రమణ, సిఐలు జి. రాంబాబు, ఈ. నర్సింహ మూర్తి, సిహెచ్. లక్ష్మణరావు, టివి తిరుపతిరావు, ఎస్. కాంతారావు, ఆర్ ఐలు చిరంజీవి, పి.నాగేశ్వరరావు, రమణమూర్తి, టివిఆర్కే కుమార్, డిపిఓ పర్యవేక్షకులు ప్రభాకరరావు, కామేశ్వరరావు, పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా