కోడి కత్తి కేసు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కంటే ఎక్కువ ట్విస్టులతో కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోడి కత్తిని ఎయిర్పోర్టులోకి స్మగ్లింగ్ చేసింది… వైసీపీ ముఖ్య నాయకుడి దగ్గర బంధువు అని బాంబు పేల్చారు నిందితుడి తరఫు లాయర్. 2019లో ఎన్నికల ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని, జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తితో పొడిచిన సంగతి ఇప్పటికీ హాట్ టాపిక్గానే ఉంది.
అప్పట్లో ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని జగన్ అండో కో ఆరోపించగా.. అలాంటి కుట్ర కోణాలేవీ లేవని తేల్చి చెప్పింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ చివరి దశకు చేరిన సమయంలో, కేసును విశాఖకు బదిలీ చేయడంతో ఇన్వెస్టిగేషన్ మళ్లీ మొదటికొచ్చింది.
కోడి కత్తిని ఎయిర్పోర్టులోకి తీసుకొచ్చింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం వైసీపీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అని ఆరోపిస్తున్నారు నిందితుడి న్యాయవాది సలీం. ఈ వైసీపీ నాయకుడే కత్తిని, సాక్షిగా ఉన్న దినేష్కుమార్కి ఇచ్చి నేరాన్ని తన క్లయింట్ జనపల్లి శ్రీనివాసరావుపై నెట్టారని లాయర్ వాదన.
విచారణకు హాజరైతే నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావడంలేదని ఆరోపించారు నిందితుడి లాయర్ సలీం. జగన్ రావాలి, వాదన వినిపించాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేస్తున్నారాయన. ఈ కేసులో కుట్ర, రాజకీయం కోణమే ఉందని ఆరోపించారు. రాజకీయాల కోసమే కేసును వాయిదాల మీద వాయిదాలు వేస్తూ.. కోర్టులు మారుస్తూ సాగదీస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం జగన్ మోహన్రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శిస్తున్నారు ప్రత్యర్ధులు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్ ఇలాగే నాలుక మడతేశారనేది వారి ఆరోపణ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన వైసీపీ అధినాయకులు, అధికారంలోకి రాగానే అబ్బే..
కేంద్ర దర్యాప్తు సంస్థల అవసరం లేదని మాట మార్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కోడి కత్తి విషయంలోనూ అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జగన్, అధికారంలోకి వచ్చి నాలుగేన్నరేళ్లు గడుస్తున్నా, తనపై జరిగిన దాడికి సంబంధించిన కేసును కూడా పరిష్కరించలేకపోయారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.
ఐదేళ్లుగా కోర్టుల చుట్టు తిరగడం తమకు తలకు మించిన భారంగా మారిందని అంటున్నారు నిందితుడి కుటుంబ సభ్యులు. నిరుపేదలమైన తమకు న్యాయం జరగడం లేదని, తన కొడుకును ఏం చేస్తారో అని భయంగా ఉందంటున్నారు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి. ఐదేళ్లు అవుతున్నా కేసు తేలడం లేదని, ముఖ్యమత్రి ఒక్కసారి కోర్టుకు వచ్చి తనను పొడిచారనో, పొడవలేదనో.. ఏదో ఒకటి చెప్పాలని విజ్క్షప్తి చేశారు.
కోర్టులు మారుతున్నాయేగానీ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా జైల్లో మగ్గిపోతున్న శ్రీనుకి న్యాయం చేయాలని కోరుతున్నారు అతని సోదరుడు సుబ్బరాజు. చట్ట ప్రకారం మూడున్నరేళ్లు శిక్షపడే అవకాశం ఉన్న కేసులో నాలుగున్నరేళ్లుగా శ్రీనివాసరావు జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వాయిదాలో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.