ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్-VII కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల మధ్య సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ములుగు ఏ ఎస్ పి పి. సాయి చైతన్య పాల్గొన్నారు.
ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ వివిధ శాఖల సమన్వయంతో సమాజంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం సాధ్యపడుతుందని తెలిపారు. బాలలను పనిలోకి పెట్టుకునే వ్యాపారస్తుల పై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రమాదకరమైన పనులలో పనిచేసే బాలలను గుర్తించి వారిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ములుగు జిల్లాలో జరగనున్నమినీ మేడారం జాతర, పర్యాటక ప్రదేశాలలో భిక్షాటన కోసం పసిపిల్లలను వినియోగించే అవకాశం ఉన్నందున ఆయా ప్రదేశాలలో బాలల కోసం ప్రత్యేక నిఘా పెంచుతామని తెలిపారు. ఇటుకల తయారీలో, హోటల్స్, మెకానిక్ షాపుల నందు మిర్చి పంట సాగులో అత్యధికంగా బాలలను వినియోగించే అవకాశం ఉన్నందున ఈ ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తనిఖీ బృందాలను ఆదేశించారు. గొత్తి కోయల గుంపులలో నిర్లక్ష్యానికి గురైన బాలల సమాచారం అలాగే బాల్య వివాహాల సమాచారం పోలీస్ శాఖకు తెలియజేయాలని కోరారు. వ్యవసాయ పనులలో పనిచేసే బాలల సమాచారం తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో వెంకటేశ్వరరావు, డిఈఓ వాసంతి, డి పి ఓ వెంకయ్య, ఏ ఎల్ వో షరీఫుద్దీన్, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ స్వాతి, వెటర్నరీ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, సిసిఎస్ సిఐ సంజీవ రావు, డి సి ఆర్ బి ఎస్ ఐ చైతన్య చందర్ తదితరులు పాల్గొన్నారు.