ప్రతీ ఏడాది నవంబర్ 14 బాలల దినోత్సవం…అదే నవంబర్ 21 న అంతర్జాతీయ బాలల దినోత్సవం. దీన్ని పురస్కరించుకునే విజయనగరం జిల్లాకు చెందిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఈ సందర్బంగా 14 నుంచీ 21 వరకు బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఆ సంస్థ ప్రచురించిన బాలల హక్కుల పరిరక్షణ పుస్తకాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక డీపీఓలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – బాలల హక్కుల పరిరక్షణ అనేది అందరి బాధ్యతని అన్నారు. భారత రాజ్యాంగం బాలలకు ప్రాధమికంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు. అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కులు కల్పించిందన్నారు. ఈ హక్కులను పరిరక్షించుట వలన బాలలను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దవచ్చునన్నారు. వీధి బాలలు, అనాధ బాలలు, విపత్తులకు గురైన బాలలకు రక్షణ కల్పించడంతోపాటు, బాల్య వివాహాలు జరగకుండా, లైంగిక వేధింపులకు గురికాకుండా, బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని స్థాయిల్లో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బాలల హక్కుల పరిరక్షణ పోలీసుశాఖ కట్టుబడి ఉందని,వారి రక్షణకు ఏ ఫిర్యాదు వచ్చినా తక్షణం స్పందించే విధంగా పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.మహిళా పోలీసులు (ఎం.ఎస్.పి.)లు క్షేత్ర స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. అంతకుముందు కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ – బాలల న్యాయ సంరక్షణ చట్టం క్రింద 14 రకాలైన ఆదరణ, సంరక్షణ కావాల్సిన పిల్లలకు ప్రభుత్వమే వివిధ సహాయ, సహకారాలను అందిస్తోందన్నారు.
గ్రామాల్లో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, బాలల హక్కులను సమర్ధవంతంగా అమలు చేయాలని కోరారు. బాలల హక్కుల ఉల్లంఘన జరిగితే 1098కు లేదా నేరుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఎన్. శ్రీనివాసరావు, జి. రాంబాబు, డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కన్వీనరు ఎన్.వర ప్రసాద్, పారా సంస్థ కో ఆర్డినేటరు ఎస్. కాళిబాబు, సమాజ చైతన్య స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటరు కే.వరలక్ష్మి, ఇంటిగ్రేటెడ్రూ రల్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషను సభ్యులు సిహెచ్.రామకృష్ణ, హ్యూమన్ రైట్స్ అసోసియేట్ చైర్మన్ భవిరెడ్డి శంకరరావు, బాలల సంఘ ప్రతినిధి లక్కిడాపు సునీల్ తదితరులు పాల్గొన్నారు.