బాలలు శారీరక ఎదుగుదలను అర్ధం చేసుకొని, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలని, జీవితం లో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడానికి జీవన నైపుణ్యాలు అలవర్చు కోవాలని ములుగు జిల్లా బాలల పరిరక్షణ అధికారి జె. ఓంకార్ అన్నారు. కోయావీరాపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామస్తులకు, బాలల తల్లిదండ్రులకు CAFED & జిల్లా బాలల పరిరక్షణ విభాగం, ములుగు అధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బాలల పరిరక్షణ అధికారి జె. ఓంకార్ హాజరయ్యారు.
బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం – 2012 మరియు బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006 పై అవగాహన కల్పించారు. బాలలు తమ హక్కులకు భంగం వాటిళ్ళితే 1098 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు. వివాహ వయసు రాకముందే బాల్య వివాహం చేసినట్లయితే తల్లిదండ్రులు, సహకరించిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా నేడు సమాజంలో బాల బాలికలపై లైంగిక దాడులు అధికమవడం చాలా బాధాకరమని, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా వారిని ఈ కార్యక్రమం ద్వారా అవగాహనపర్చి తమను తాము కాపాడుకొనేలా, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చట్టపరమైన రక్షణ పొందేలా జిల్లాలోని బాలల బాలికలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.
18 సంత్సరాల లోపు వయసు గల బాలల పై లైంగిక వేదింపులు, లైంగిక హింసలు పాల్పడినట్లయితే పొక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతున్నదని, మరియు మైనర్ బాలికను యువకులు తీసుకెళ్లడం మరియు పెళ్ళి చేసుకోవడం కూడా ఈ చట్టం క్రిందకే వస్తుందని తల్లిదండ్రులకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సమ్మక్క, CAFED సంస్థ వాజేడు మండల కోఆర్డినేటర్ G.కామేష్, ఆనిమేటర్స్ రమాదేవి, భాస్కర్, ప్రసాద్, స్వరూప లు, చైల్డ్ లైన్ జయసుధ, స్థానిక అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్త మరియు 70 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.