ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ భయాందోళనలు సృష్టిస్తున్న వేళ చైనా యువతి, భారత యువకుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.చైనాకు చెందిన జిహావో వాంగ్, భారత్కు చెందిన సత్యార్థ్ మిశ్రా ఐదేళ్ల క్రితం కెనడాలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వధువు కుటుంబ సభ్యులే భారత్కు విచ్చేసి కన్యాదానం నిర్వహించారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మాందసౌర్లో ఆదివారం చోటుచేసుకుంది.ప్రేమతో ఒకటైన ఈ జంటకు వారి కుటుంబ సబ్యులకు వైద్య పరీక్షలు నిర్వాహించాకే అధికారులు వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వధువు తల్లిదండ్రులు మధ్యప్రదేశ్కు రాగా వారికి ఐదుగురు వైద్యులతో కూడిన బృందం కరోనా టెస్ట్లు చేసింది. ఈ పరీక్షల్లో కరోనా లక్షణాలు ఏమీ లేవని తేలినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వరుడు, వధువు కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
జిహావో తండ్రి షిబో వాంగ్ మాట్లాడుతూ..‘మాకు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అందుకు మేము ఏమాత్రం ఇబ్బంది పడలేదు. నిజానికి మేము నివాసం ఉండే చోట కరోనా వైరస్ వ్యాపించలేదు. అయినప్పటికీ అందరి క్షేమం దృష్ట్యా వైద్యాధికారులకు సహకరించాం. మా కూతురి పెళ్లి జరిగిపోయింది. ఇక మేం తిరిగి చైనాకు వెళ్లిపోతాం’ అని తెలిపారు.