కేంద్ర మోడి ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ చట్ట సవరణ 2020 రద్దు చేయాలని ఢిల్లీలో లక్షలాది మంది రైతులు చేస్తున్నపోరాటానికి మద్దతుగా సోమవారం కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం డే&నైట్ జంక్షన్ నుంచి ర్యాలీగా ఛలో ఇన్ కమ్ టాక్స్ ఆఫీసు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేఖమైన మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లులు తీసుకువచ్చిందని విమర్శించారు. వీటివల్ల వ్యవసాయం కార్పొరేటీకరణ అవుతుందన్నారు. మన రైతాంగం దివాలా తీస్తుందని, మద్దతు ధరలు, ప్రభుత్వ కొనుగోలు సంస్థలు నిర్వీర్యం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార పంటలకు బదులు డాలర్ల సంపాదన కోసం వాణిజ్య పంటలు ప్రోత్సహించ బడతాయని, ఇది మన దేశ ప్రజల ఆహారభద్రతకు ప్రమాదంగా మారుతుందని అన్నారు.
విద్యుత్ రంగం ప్రైవేటీకరించబడి, వ్యవసాయానికి బలహీనవర్గాలకు ఇస్తున్నసబ్సిడీలు అందకుండా పోతాయని అన్నారు. ధరలు పెరిగి, దేశ ప్రజానీకానికి నష్టదాయకమైన వ్యవసాయ చట్టాలను దేశ సమైక్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాలతో సంప్రదించకుండా, పార్లమెంటులో తగిన చర్చలు చేయకుండా అప్రజాస్వామికంగా నియంతృత్వ ధోరణితో చట్టాలు చేసి, 62 లక్షల కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్నిబడా కంపెనీలకు అప్పగించడం దుర్మార్గం అని విమర్శించారు.
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు ఉద్యమబాట పట్టి పోరాడుతున్నారన్నారు. ఢిల్లీలో విపరీతమైన చలిని కూడా లెక్కచేయకుండా గత 15 రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నారని అన్నారు. డిసెంబరు 8వ తేదిన దేశవ్యాప్తంగా రైతులతో పాటు కార్మికులు, చిన్న వ్యాపారుల, ఉద్యోగులు, మేధావులు అన్ని తరగతి ప్రజలు భారత్ బంద్ ద్వారా తమ నిరసనలు వ్యక్తం చేశారన్నారు. అయినా మోడీ ప్రభుత్వం వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం సవరణల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే వ్యవసాయ చట్టాలను విద్యుత్ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల టర్నోవర్ కలిగిన గుత్త పెట్టుబడిదారులకు మార్కెట్ సెస్సును రద్దుచేసి, సామాన్య ప్రజానీకం ప్రయాణించే వాహనాల పైన, సరుకుల రవాణా పైన టోల్ ఫీజు వసూలు చేయడాన్నిఖండించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి భవిరి.కృష్ణమూర్తి, ఆలిండియా కిసాన్ సంఘర్స్ కో ఆర్డినేషన్ కమిటీ నాయకులు కె.మోహనరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సిపిఎం శ్రీకాకుళం నగర కార్యదర్శి టి.తిరుపతిరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ, జిల్లా కార్యదర్శి గంగరాపు. సింహాచలం, కౌలు రైతుల సంఘము జిల్లా అధ్యక్షులు వెలమల.రమణ, ఐద్వా నాయకులు జి.చంద్రిక, రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు కె.సూరయ్య, యం.తిరుపతిరావు, బి.శ్యామసుందరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు.