సిఐ శ్రీనివాస్, డిఎస్పీ భక్తవత్సలంలపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: అమరావతి బహుజన ఐకాస డిమాండ్
మాజీ మంత్రి జవహర్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన సిఐ శ్రీనివాస్, డిఎస్పీ భక్త వత్సలంపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలుకోటయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం వ్యక్తిగత కక్షతో జవహర్ ను, ఆయన భార్యా, పిల్లలను పరుష పదజాలంతో దూషించారన్నారు. జేబులో ఉన్న ఏటిఎం కార్ట్ ను, సెల్ ఫోన్ ను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఒక మాజీ మంత్రి అన్న కనీస గౌరవం చూపకుండా పోలీస్ స్టేషన్లో కటిక నేలపై కూర్చోబెట్టారని ఆరోపించారు. కేవలం అగ్రకుల అహంకారంతోనే ఇలాంటి దాష్టీకానికి పాల్పడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆగడాలను దళిత లోకం సహించబోదని హెచ్చరించారు. ఈరోజులా రేపు ఉండదన్న సత్యాన్ని పోలీసు అధికారులు గ్రహించాలని హితవు పలికారు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ బూటకపు మాటలు చెప్పే ముఖ్యమంత్రి ఇరువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య ముఖ్యమంత్రిని కోరారు.