రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేసే అన్యాయాలను, అక్రమ మైనింగ్ లను ప్రశ్నిస్తున్నారనే కారణంతో తెలుగుదేశం పార్టీ నేతల్ని అరెస్టు చేయడం అన్యాయమని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని ఆయన అన్నారు. అక్రమంగా అరెస్ట్ అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా బెయిలు పై విడుదలైన సందర్భంగా గొల్లపూడి లోని ఆయన కార్యాలయంలో రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ చెన్నూపాటి గాంధీ, టీడీపీ నాయకులు కుర్రా నరేంద్ర తదితరులు ఆయనతో ఉన్నారు.
ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని, ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారని అన్నారు.
ఎన్ని విధాలుగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టినా తాము ప్రజల పక్షాన నిలబడి వైసీపీ నేతలు చేసే ప్రతి అక్రమాల్ని వెలికి తీస్తామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాన్ని ప్రజలు అంతా గమనిస్తూన్నారని వైసీపీ ప్రభుత్వం పై తిరగబడే రోజులు అతి తొందరలోనే ఉన్నాయని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా బీసీ సెల్ సెక్రెటరీ జంపన వీర శ్రీనివాస్, యువ నాయకుడు వల్లూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.