సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలకి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేరిన సందర్భంలో విసిఓ లతో కలిసి నడిచి గజపతినగరం, చీపురుపల్లి లలో జరిగిన బహిరంగ సభల్లో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి గ్రామ సమన్వయకర్తలకి తీవ్రమైన అన్యాయం చేశారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ సాక్షర భారత్ విసిఓ ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుగత అశోక్ తెలియచేశారు.
సీఎం జగన్ విసిఓ లకి న్యాయం చేయాలని ఉదయం ఆంధ్రప్రదేశ్ సాక్షర భారత్ విసిఓ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్.సూర్యకుమారి కి వినతిపత్రం అందజేశారు.
అనంతరం బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలు విద్యావ్యాప్తికి వారధులు, సమాజ ప్రగతికి రధసారధులు, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే సంధాన కర్తలు, చీకటిలో మగ్గుతున్న సమాజాన్ని వెలుగు వైపు పయనింపచేయలన్న బృహత్తర కార్యక్రమాన్ని భుజాన ఎత్తుకుని నేడు అంధకారంలో కూరుకుపోయి గత ప్రభుత్వ ఉత్తర్వుల వెన్నుపోటుతో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అత్యంత దయనీయ స్థితిలో నేడు కాలం గడుపుతూ నేడు అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న విసిఓ లని రోడ్డున పడేసి ఎమ్.సి.ఓ లకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి తీవ్రమైన నమ్మక ద్రోహం సీఎం జగన్ చేశారని బుగత అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం 2010 వ సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ కార్యక్రమం ప్రారంభించింది. దీని అమలు కోసం రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీలో ఇద్దరు సాక్షర భారత్ సమన్వయకర్తలను నెలకి కేవలం 2000 వేల రూపాయిలు మాత్రమే గౌరవవేతనం ఇచ్చి నియమించడం జరిగిందన్నారు.
వాళ్ళు రాత్రి బడులు నిర్వహించడంతో పాటు గ్రామంలో ప్రజలకి వి.ఆర్.ఓ అందించే అన్ని సేవలు గ్రామ సమన్వయకర్తలు అందించేవారన్నారు. ఒకరకంగా ఆయా మండల స్థాయి అధికారులందరూ విసిఓ లతో గొడ్డు చాకిరి చేయించేవారని తెలిపారు. అయితే గత సీఎం బాబు హయాంలో 2018 మార్చి 31 నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిలిపివేసి మూడు నెలల తరువాత జూన్లో ఉత్తర్వులు చేయడంతో చిరుఉద్యోగులు చిగురుటాకుల్లా తల్లడిల్లిపోయారన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో సుమారు 20 వేల మంది, ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 2000 వందల మంది గ్రామ పంచాయతీ సమన్వయకర్తలు ఉద్యోగం ఉపాధి కోల్పోయి రోడ్డున పడేసిన పాపం మీకు కూడా తగులుతుందని మండిపడ్డారు. అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళకి ఒక ఏడాది జీతాలు బకాయి చెల్లించకపోవడం వలన గ్రామపంచాయతీ సమన్వయకర్తల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయిందన్నారు.
ఆనాటి నుంచి వీధినపడ్డ సమన్వయకర్తలంతా ఏఐటీయూసీ నేతృత్వంలో జిల్లా వ్యాపితంగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందన్నారు. విజయనగరం జిల్లాలో చేరిన పాదయాత్రలో సాక్షర భారత్ గ్రామ సమన్వయ కర్తలు ఎక్కడిక్కడ అతనితో కలిసి అడుగులు వేస్తూ వారి బాధలను, కష్టాలను చెప్పుకున్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించి మీ అందరికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో సమన్వయకర్తలందరు ఎన్నో ఆశలు పెట్టుకుని వారి సర్వీసుల వయస్సులు పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి చేస్తారేమో అని ఎదురుచూస్తున్నారు
కాబట్టి సీఎం జగన్ మీరు తక్షణమే ఎమ్.సి.ఓ లకి ఇచ్చిన మాదిరిగానే విసిఓ లకి కూడా ఉద్యోగాలు ఇచ్చి హామీని అమలు చేసి న్యాయం చేయాలని లేనియెడల ఏఐటీయూసీ నేతృత్వంలో ఉద్యమబాటే వాళ్ళకి శరణ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విసిఓ లందరిని ఐక్యం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఆర్. పాండురంగ నాయుడు (జియ్యమ్మవలస), బి. బంగార్రాజు (విజయనగరం), జె. అప్పల నాయుడు (చీపురుపల్లి), ఎమ్. ప్రకాష్ రావు (విజయనగరం), ఎస్. నాగలక్ష్మి (బొండపల్లి), బి. బాలా కుమారి (కొత్తవలస), ఎం.వీ రమణ, రామమూర్తి (గంట్యాడ) మరి కొన్ని మండలాల విసిఓ లు పాల్గొన్నారు.