టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దెబ్బతిన్న పులి. ఆయన చూపు ఎప్పుడు ఎవరిపై పడుతుందో అని ప్రత్యర్ధులు బెంబేలెత్తుతున్నారు. బెయిల్ పై విడుదల తర్వాత రాజమండ్రి నుండి అమరావతిలోని కరకట్ట చేరుకోవడానికి ఏకంగా 15 గంటల సమయం పట్టింది. చంద్రబాబు ఆత్మవిశ్వాసం ఇనుమడించిన సందర్భం ఇది. అందుకే, చంద్రబాబు ఈసారి పక్కాగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. బాబు ఆలోచనలు, వ్యూహాలు ఎలా ఉంటాయో వైసీపీ సీనియర్ నేతలకు బాగా తెలుసు. బెయిల్పై బయటకు వచ్చిన చంద్రబాబు వేసిన రెండే రెండు అంశాలతో బులుగు పార్టీ నేతల మైండ్ బ్లాంక్ అయింది. బాబుని ఎందుకు కెలకకూడదో వారికి అర్ధం అయిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
చంద్రబాబు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆయన తన న్యాయవాదులను సంప్రదించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 12 మంది ఐఏఎస్ అధికారులను చేర్చాలని సీఐడీకి ఫిర్యాదు చేశారు ఆయన తరఫు న్యాయవాది ప్రసాద్ సీఐడీ వారి పేర్లను నమోదు చేయకపోతే కేసు కోర్టుకు చేరుతుంది. దీంతో, మరో రచ్చ మొదలవుతుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుని ఇరికించడానికి ఇంతవరకు ఒక్క ఆధారమూ సేకరించలేపోయింది సీఐడీ అంటే, ఆధారం దొరికినా దొరకకపోయినా, ఈ కేసులో చంద్రబాబుతో పాటు జగన్ని నమ్మిన అధికారులు సైతం అడ్డంగా బుక్ అవక తప్పదు. ఇదే ఇప్పుడు ఐఏఎస్లని షేక్ చేస్తోంది. ఇది తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే భయం వారిని వెంటాడుతోంది.
చంద్రబాబు కదిలించిన మరో అంశం జగన్ అవినీతి, అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేయడం అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. గత 3041 వాయిదాల తర్వాత కూడా జగన్ ఇంతవరకు తన కేసులపై సీబీఐ కోర్టుకి హాజరు కావడం లేదని వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు సుప్రీం కోర్టులో కంప్లయింట్ చేశారు. దీనివెనక చంద్రబాబు ఉన్నాడని కొందరు వాదిస్తున్నారు. ఈ కేసుపై ఇటు జగన్కి, అటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఈ కేసుని వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది సుప్రీం. అయితే లేట్గా అయినా లేటెస్ట్గా జగన్ చుట్టూ అవినీతి, అక్రమాస్తుల కేసులో ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని, వీటిని చంద్రబాబు అంత తేలికగా వదిలిపెట్టరని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ రెండు అంశాలతోపాటు చంద్రబాబు నాయుడు త్వరలోనే జగన్పై కొత్త వ్యూహాలతో ముందుకు రానున్నారని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, బాబు ఎటాక్తో జగన్ ఇక ఆత్మరక్షణలో పడడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి, ఏపీ రాజకీయాలు ఇప్పటికే కాక మీద ఉంటే త్వరలో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి రేపుతున్నాయి.