హైకోర్టుకు ముందుకు వచ్చిన పిటిషన్ల అన్నింటినీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ప్రభావితం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణ చేశారు.
ఈ మేరకు ఆయన అధికారికంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ వివరాలను ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం నేడు మీడియా ఎదుట ఉంచారు.
కొంతమంది న్యాయమూర్తుల వ్యక్తిగత ఉద్దేశాలను బయట పెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి తన లేఖలో స్పష్టం చేశారు.అమరావతి స్కాంలో సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తె ల పాత్ర పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే కి సీఎం జగన్ రాసిన లేఖలో వివరించారు.
టిడిపి కి అనుకూలం గా హై కోర్టు ఇస్తున్న తీర్పుల కాపీలను ఈ లేఖతో ముఖ్యమంత్రి జత చేశారు. మాజీ ఏజీ దమ్మాలపాటి కేసు లో మీడియా కవరేజ్ లేకుండా జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
టిడిపి అధినేత చంద్రబాబు తో దమ్మాలపాటికి ఉన్న సంబంధాల నేపథ్యం లో ఈ ఆదేశాలు వచ్చాయని ఆయన ఆరోపించారు.సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిగా ఉన్న ఎన్వీ రమణ రాష్ట్ర హై కోర్టులో జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబుతో ఎన్వీ రమనకు ఉన్న సాన్నిహిత్యం,టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.ఉద్దేశపూర్వకంగానే దమ్మాలపాటి శ్రీనివాస్ కు అనుకూలంగా ఆర్డర్స్ ఇచ్చేలా చేశారని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు.
ఎన్వీ రమణ ప్రభావంతో ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఉంచామని అజయ్ కల్లాం తెలిపారు.