ఉదయాన్నే రోడ్డు మార్గాన యాదాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ నిర్మాణ పనులను కూలంకషంగా పరిశీలించారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు ఆశీర్వాదాలు అందజేశారు.
ఆలయ పునర్నిర్మాణ పనులను ఆర్కిటెక్ట్ ఆనందసాయి సిఎం కేసీఆర్కు వివరించారు. అభివృద్ది పనులకు సంబంధించిన సమాచారాన్ని ఆయనకు అందించారు. ఆలయ గోపురాలు, తదితర పనులకు సంబంధించిన వివరాలు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంలో సీఎంతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, సీఎం కార్యదర్శి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదారి కిషోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, కలెక్టర్ అనిత రాం తదితరులు ఉన్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయించడంతోపాటు మహాకుంభాభిషేకంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఆలయ నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయడం సహా, యాగ నిర్వహణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో సమీక్షించారు. ప్రధాన ఆలయ నిర్మాణాలతో పాటు, టెంపుల్ సిటీ, యాగ స్థాలాన్ని సీఎం పరిశీలించారు. ప్రధాన ఆలయ నిర్మాణాలను పూర్తి చేసి, వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా మహాకుంభాభిషేకం నిర్వహించాలన్న యోచనలో సీఎం పర్యటన సాగింది.
ఆలయ నగరిలో కాటేజీల నిర్మాణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. గుట్ట దిగువన గండిచెరువు సమీపంలో యాగాన్ని నిర్వహించే అవకాశముంది. ఆ స్థాలాన్ని సీఎం పరిశీలించిన తర్వాత వేదిక నిర్ణయం కానుంది. గత ఆగస్టులో యాదాద్రిలో పర్యటించిన కేసీఆర్ 5 గంటల పాటు ఏకధాటిగా సమీక్ష నిర్వహించారు.
సీఎం పర్యటన తర్వాత నిర్మాణపనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు మరోసారి కేసీఆర్ రావడంతో వచ్చే రెండు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాలు త్వరిత గతిన పూర్తయ్యే అవకాశముంది.